దీపావళి

దీపావళిభారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు. ప్రత్యేకంగా పండుగను చేసుకోని నాస్తికులు సైతం పండుగ దినాలను మాత్రం ఖచ్చితంగా సంతోషంగా అనుభవించే తీరతారు. అది పూజతో నిమిత్తం లేనిది. సంతోష ఉత్సాహాలకు నిలయమైనది. కాబట్టే పండుగ అనే భావన ఎటువంటివారిలోనైనా అలౌకికానందాన్ని పంచుతుంది. ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకమైన శోభను చేకూరుస్తూ మానసికోల్లసాన్నిస్తూ గృహాలకు కొత్త అందాలను ఇస్తుంది. అందుకే చిన్నా, పెద్దా అందరూ వీటికోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తుంటారు. పండుగల సంబరాలు చిన్న పిల్లలవే అయినప్పటికీ ఆ ముచ్చట్లను పెద్ద్లలు కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తారు. వరలక్ష్మీ వ్రతం, అట్లతద్ది, నాగుల చవితి వంటి పండుగలను స్త్రీలు ఇష్టపడితే, ఉగాది, వినాయక చవితి వంటివి ఎక్కువ శాతం పురుషులు ఇష్టపడడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఐతే వయసుతో నిమిత్తం లేకుండా, స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ ఇష్టపడే ఏకైక పండుగ మాత్రం దీపావళి ఒక్కటే. 

దక్షిణ భారతదేశమంతా మూడు రోజులపాటు జరుపుకునే దీపావళి ఎంతో ఉత్తేజకరమైన పండుగ. ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ధ పాఢ్యమి మూడు రోజులనూ కలిసి సమగ్రమైన దీపావళి. ఈ మూడు రోజుల్లో మొదటిది నరక చతుర్దశి. రెండవది దీపావళి. మూడవది బలిపాడ్యమి. 

దీపావళిఈ పండుగను ఆచరించే విధానంలో అనేక గాధలున్నాయి. 1. నరకాసుర వధ, 2. బలి చక్రవర్తి రాజ్యదానము, 3. శ్రీరాముడు రావణ సంహారానంతరం అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమావేశమగుట (భరత్ మిలాప్), 4. విక్రమార్క చక్రవరి పట్టాభిషేకం. భారత దేశమంతటా ప్రచారమున్న గాధ నరకాసుర వధ. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాటి రాత్రి రెండు జాములకు తరువాత శ్రీకృష్ణుడు నరకాసురుని వధించెను. నరకుడి పీడ వదలటంతో ఆనందపరవశులైన ప్రజలు అదే రాత్రి మిగిలిన భాగమును, మరుదినమునను మహోత్సవాలు జరుపుకొన్నారు. ఆనాటి ఉత్సవాలకు చిహ్నంగా ప్రజలు ప్రతి యేటా ఈ రెండు రోజులూ గొప్పగా పండుగలు చేసుకొంటున్నారు. భరత్ మిలాప్ : శ్రీరామచంద్రుడు రావణ వధానంతరం లంక నుండి అయోధ్యా నగరానికి మరల తిరిగిరావడం, పట్టాభిషేకం జరగడం ఈనాడే అంటారు. శ్రీరాముడు భరతునితో మరల కలియుటకు ఉపలక్షణంగా "భరత్ మిలాప్" అను పండుగ ఉత్తర భారతమంతా నేటికీ చేస్తున్నారు. ఈ విశ్వాసం వల్లనే రాజులు విజయదశమి నాడు సీమోల్లంఘన చేసి శత్రువులపై దాడి చేసి, విజయంతో దీపావళి నాడు మరలి వచ్చుట సంప్రదామయ్యింది. ఒక్కో పురాణంలో, ఒక్కో ధర్మ శాస్త్రంలో ఒక్కో గాధ లిఖించబడినప్పటికీ నరకాసుర వధ మాత్రమే దీపావళి పండుగకు అంకురార్పణ అన్న గాధనే అందరూ అనుసరిస్తుండడంతో అదే స్థిరపడిపోయింది. 

దీపావళిఆశ్వయుజ మాస బహుళ చతుర్ధశిని 'నరక చతుర్ధశి' అని, ఆ మరుసటి రోజును 'దీపావళి' అమావాస్య అని అంటారు. ఇది పిన్నలకూ, పెద్దలకూ సరదా పండుగ. తలస్నానం చేసి, కొత్త దుస్తులు ధరించడం, పిండివంటలతో భోజనం చేసి, సాయంత్రం కాగానే దీపాల్ని వరుసగా వెలిగించి, అనంతరం టపాకాయలు కాల్చడం ఈ పండుగకు ఆనవాయితి. నరకాసుర సహారం జరిగినందుకు ఆనంద సూచకంగ జరుపుకొనే ఈపండుగ, మార్వాడీలకు ఇంకో విధంగా కూడా ప్రత్యేకమైనది. వారికిది లక్ష్మీ పూజాదినం. పాత ఖాతాలు మూసేసి, కొత్త పద్దులు ప్రారంభిస్తారు. 

శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై లోకకంటకుడైన నరకాసురుని వధించినందుకు సంబరంగా జరుపుకొనే ఈ దీపావళి పండుగను దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చిన దివ్యజ్యోతి ఈ జీవకోటికి వెలుగును ప్రసాదించిన విశిష్టమైన రోజుగా మరియు శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించి సీతాదేవితో అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడైన శుభసందర్భంగా కూడా చెప్పుకుంటారు. 

దీపావళికి దేదీప్యమైన దివ్యకాంతుల దీపాలను అలంకరించి, బాణాసంచా కాలుస్తూ, అందరూ వారి వారి ఆనందాలను వ్యక్త పరుస్తూ ఉంటారు. ఇక ప్రకృతి పరంగా ఆలోచిస్తే, ఈ కాలమందు సర్వజీవులను వ్యాధిగ్రస్తులను చేసే కీటకాలు, పంటలను నాశనము చేసే క్రిమికీటకాలు అధికంగా ఉధ్బవిస్తాయి. కనుక ఈ బాణాసంచా కాల్పుల వల్ల కీటకసంహారం కలిగి ప్రజలకు అన్నివిధాల మేలు జరుగుటకే ఈఆచారం పెట్టి ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. 

దీపావళిఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో, ఆ ఇంట శ్రీమహాలక్ష్మి ప్రవేశిస్తుందని మనకు ఋగ్వేదం చెప్తోంది. అటువంటి పుణ్య దిన సాయం సంధ్యా కాలమందు లక్ష్మీస్వరూపమైన తులసికోట ముందు తొలుత దీపాలు వెలిగించి, శ్రీమహాలక్ష్మి అష్టోత్తరశతనామాలతో క్రింద వర్ణించిన విధంగాపూజ గావించి, ఈ సర్వప్రాణ కోటికి హృదయ తాపాలను పోగొట్టు సర్వ సంపన్న శక్తివంతురాలుగా భావించి, నివేదన చేసి, పూజానంతరం గృహమంతా దీపాలంకృతం చేయుటవల్ల కాలి అందియలు ఘల్లు ఘల్లుమ‌ని అన్నట్లు ఆమహాలక్ష్మి ప్రసన్నమౌతుందట!

కామెంట్‌లు లేవు: