కేదారేశ్వర వ్రతము

కార్తీకమాసంలో కొన్ని ప్రాంతాలలో నవగ్రహ దీపాల నోమును కూడా నోస్తారు. ఈ నోములో నవగ్రహాలదే ప్రధాన తాంబూలం. కార్తీక మాసంలో మూడు రోజులపాటు ఈ నోమును యజ్ఞభావనతో చేస్తారు. ముందుగా గణపతి ఆరాధన చేసి, తరువాయి శివలింగార్చనచేసి, నవధాన్యాలను కొద్దికొద్దిగా తీసి వాటిపై దీప ప్రమిదలనుంచి ఓం నమ:శ్శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్మరిస్తారు. తరువాత అమ్మవారికి సంభంధించిన స్తోత్ర పారాయణ చేసి తొమ్మండుగురు బ్రాహ్మణులకు ఆ దీపాలను దానం ఇస్తారు. దానం చేసేటప్పుడు యధాశక్తి దక్షిణను మాత్రం నిండు మనసుతో సమర్పించాలి. ఈ నోము శుభతిధులలో సాయం వేళలలో మాత్రమే జరగాలి. నోము అనంతరం అక్షతలను గృహం ఈశాన్య భాగంలో కొద్దిగాచల్లి, కుటుంబంలో అందరూ శిరస్సుపై చల్లుకోవాలి.....ఈనోము తరతరాలుగా అనేక ప్రాంతాలలో జరుగుతోంది. ఇది సర్వ రక్షాకరంగా కుటుంబాన్ని కాపాడుతుందని భారతీయుల ప్రగాఢ విశ్వాసం. ఈ నోము ఫలితాలు కార్తీక మహాపురాణంలలో వివరంగా కన్పిస్తాయి. 

మరో ముఖ్య విశేషమేమంటే....కార్తీక మాసంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి పుణ్య వ్రతాన్ని లక్షలాది కుటుంబాల్లో తప్పనిసరిగా జరిపిస్తారు. ఈ పుణ్యదినాలలో ఈ వ్రతం ఆచరించడంవల్ల సర్వ భోగభాగ్యాలు శ్రీ సత్యనారాయణ స్వామి కటాక్షంగా లభిస్తాయని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఆంధ్ర ప్రాంతీయులకంటే తెలంగాణా ప్రాంతాలలో ఈ వ్రతాచరణ ఒక విధి విధానమవ్వడం, ఆచరించే విధానంలో వుండే పద్ధతులు ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని ప్రాంతాలలో శ్రీ కేదారశ్వరస్వామి వారి వ్రతాన్ని ఈ మాసంలోనే జరపడం మరో విశేషం.ఉత్తర భారతదేశంలో ఈ మాసంలో బిల్వపత్ర వ్రతాన్ని జరిపిస్తారు. ఇంటింటా లక్షలాది మారేడు దళాలతో ఈ మాసం పవిత్రమౌతుంది. శక్తి ఉన్నవారు స్వర్ణ బిల్వపత్రాలను చేయించి తొమ్మిది రోజులు శివసన్నిధిలో ఉంచి బ్రాహ్మణోత్తములకు లేదా వృద్ధ ముత్తయిదువులకు దానమిచ్చి బిల్వాష్టకమును పారాయణ చేస్తారు. 

ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ దానాలు చేసినా, వ్రతాలు చేసినా కార్తీక వైభోగం కార్తీక వైభోగమే ! 'ఒక్క బిల్వాన్ని శివుడికి అర్పి స్తే చాలు!జన్మ ధన్యమౌతుంది' ఒక్క పొద్దు ఉపవాసముంటే చాలు! కైలాసవాసం ప్రాప్తిస్తుంది. ఒక్క దీపాన్ని దానమిస్తే చాలు ! జీవితం ఐశ్వర్యమయమౌతుంది'.... ఇలా అనేక నమ్మకాలతో మనస్సు పవిత్రమయంగా పరమేశ్వ్ర సేవలో లగ్నమౌతుంది. 

కొరతలేని జీవనానికి కార్తీక మాసంలో మహేశ్వరుణ్ణి మనసారా ఆరాధించండి. కార్తీకమాస పుణ్యవ్రతాలను మంగళప్రదంగా ఆచరించండి. శివతత్త్వాన్ని గృహంలో ప్రతిష్టించండి. కార్తీక పురాణ కధలను పదిమంది ముందు పఠించండి. భక్తికి ప్రాధాన్యత ఇస్తూ అర్ధనారీశ్వర చైతనాన్ని హృదయంలో నింపుకోండి. ఆ ప్రార్ధనాశక్తి ఆవిర్భవింపచేసే మహాతేజస్సు శివం...శివం....అంటూ హృదయాన్ని ప్రకాశింపచేస్తుంది. ఆ వెలుగును వర్ణించడానికి మాటలు అందవు. అది అఖండం...అపూర్వం...అమోఘం.... 

ఇదే వ్రతం ఫలం....జన్మజన్మాల పుణ్యఫలం...

కామెంట్‌లు లేవు: