ఏరువాక పూర్ణిమ


ఇది రైతు సోదరులకు అత్యంత ప్రియమైన పండుగ. ఈ "ఏరువాక పూర్ణిమ"ను రైతులు ప్రతి సంవత్సరం 'జ్యేష్ఠ శుద్ద పూర్ణిమ ' నాడు తమపొలలాలలో దుక్కు దున్ని ఎంతో వైభవంగా దీనిని ఆచరించెదరు. ఈదినమందు మరో ముఖ్య విషయం, వార్కి అను నిత్యము వ్యవసాయ పనులలోను వ్యవసాయ అభివృద్దికి చేదోడు వాదోడుగా ఉంటూ, కాలి అందియలు ఘల్లు ఘల్లుమని గంటలు మ్రొగించుకుంటూ "ధాన్యలక్ష్మిని" ఇంటికి తోడ్కొని వచ్చే, వాటి మెడలో కొత్త గంటలు, పలురంగుల పూసలు, పూలతో నిండిన దిష్టితాళ్ళతో వాటిని అలంకరించి, పిదప మంగళవాద్యములతో పొలమునకు తోడ్కొని పోయి అచ్చట నాగలిని, ఈ బసవన్నలను ధూపదీపనైవేద్యములతో పూజించి అనంతరము భూమిని దుక్కిదున్ని "ఏరువాక " ప్రారంభించే శుభదినము 'అన్నదాతలకు '. అలా ఆచరించటవలన వార్కి చక్కని సిరులపంట పండుతుందని వారు విశ్వాసముగా భావిస్తారు. అది కేవలం వారి విశ్వాసమేకాదు వాస్తవము కూడా! అటువంటి వేడుకలు తిలకించాలి అంటే, ప్రకృతి రమణీయ డృశ్యాలతో పచ్చని పైరులతో పాడిపంటలతో నిండి ఉండే పల్లెసీమలే పట్టుగొమ్మలు.

"మంత్ర యజ్ఞపరా విప్రా సీయజ్ఞాశ్చ కర్షకాః

గిరి యజ్ఞస్థథా గోపాః ఇజ్యోస్మాభిర్గిరిర్వనే||

అని శ్రీ కృష్ణపరమాత్మ గోపాలురకు గిరియజ్ఞము, కర్షకులకు ఏరువాక యజ్ఞముగా, బ్రాహ్మణులు మంత్రజపమే యజ్ఞముగా చేయుదురని తెలుపగా, విష్ణుపురాణము దీనిని ఏరువాక 'సీతాయజ్ఞామని పేర్కొనూన్నది. ఈ "ఏరువాక పూర్ణిమ" పండుగ అతి ప్రాచీనమైన పండుగగా గోచరించుచున్నది. శుద్ధోదన మహారాజు ఆనాడు 'కపిలవస్తులో' లాంచనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ ఒక బంగారు రంగు నాగలిని 'కర్షకులకూ అందించినట్లు మరియు ఎంతో ప్రజాదరణ పొందిన శ్రీకృష్ణదేవరాయ సార్వభౌముడు కూడా, వారి కృషిని అభినందించి తగు రైతు సోదరులను ప్రోత్సహించినట్లు; ఇలా ఈ "ఏరువాక పూర్ణిమ" గూర్చి ఎన్నో గాథలు ఉన్నాయి.

కామెంట్‌లు లేవు: